నాయనా కుమారా..రా స్వామీ రా నువ్వే సిఎం-కర్ణాటకం సీన్


కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మలుపులు చోటు చేసుకున్నాయ్.  అధికార పీఠం దక్కించుకుంటుందని అంచనా వేసిన బిజెపి పరుగు ఏడు సీట్ల తేడాతో ఆగిపోతుండగా..కాంగ్రెస్ పార్టీకి 78సీట్లు దక్కాయ్. మరోవైపున జెడిఎస్‌కి 32 లేదంటే 33 సీట్లు దక్కించుకుని కింగ్ మేకర్‌గా అవతరించనుంది.
ఈ సమీకరణాలే ఇప్పుడు కర్నాటకతో పాటు దేశవ్యాప్తంగా రాజకీయాల్లో ఉత్కంఠని కలిగిస్తున్నాయ్. ఎందుకంటే నిన్న రాత్రే కర్నాటకలో దిగబడిన గులాంనబీ ఆజాద్ సహా మరో దూత ఇవాళ తమ ప్రయత్నాలు మరింత మమ్మురం చేశాయ్. ముఖ్యమంత్రి పీఠం కూడా జేడిఎస్‌కే వదిలిపెడుతున్నట్లు ప్రకటించి, ఓ ఫీలర్ వదిలాయ్. దీంతో ఇప్పటిదాకా రేసులో ఉన్న బిజెపి జెడిఎస్‌ని దువ్వకతప్పని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే జెడిఎస్‌కి డిప్యూటి సిఎం సహా ఇంకొన్ని పదవులు మాత్రమే బిజెపి కానీ కాంగ్రెస్ కానీ ఆఫర్ చేస్తుందని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ విసిరిన అస్త్రంతో బిజెపి కూడా అంతకు మించిన తాయిలమేదో జెడిఎస్‌కి చూపించాలి. ఇక్కడే మూడు రకాల సన్నివేశాలను మనం భవిష్యత్తులో చూడొచ్చు
సీన్ 1
ఎక్కువ సీట్లతో పెద్ద పార్టీగా అవతరించిన బిజెపిని గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించవచ్చు అప్పుడిక బేరసారాలు భారీగా చోటు చేసుకోవచ్చు లేదంటే జెడిఎస్‌లో చీలిక తీసుకువచ్చి..బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. లేదంటే కాంగ్రెస్‌లోని యాంటీ సిధ్దరామయ్య వర్గానికి చెందిన పదిమంది ఎమ్మెల్యేలను లాగేసుకున్నా బిజెపి సేఫ్‌గా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది
సీన్ 2
బిజెపి ప్రభుత్వం ఏర్పాటుకి నిరాకరిస్తే, (దాదాపుగా ఇది జరగదు) కాంగ్రెస్, జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. దీనికెటూ కాంగ్రెస్ అధినేత్రి సొనియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారని అంటున్నారు కూడా..ఇక్కడే ముఖ్యమంత్రి పదవి ఒక్కటి కుమారస్వామికి ఇచ్చి మిగిలిన పదవులు కాంగ్రెస్ పంచుకోవచ్చు. లేదంటే రెండున్నరేళ్లు కుమారస్వామి..మిగిలిన కాంగ్రెస్‌కి చెందిన నేతలను ముఖ్యమంత్రిగా పదవి నిర్వహించుకునేందుకు డీల్ కుదుర్చుకోవచ్చు. ఇలాంటి ఒప్పందాలలో కాంగ్రెస్ సిధ్దహస్తురాలు కూడా..!
సీన్ 3
బిజెపి ప్రభుత్వం ఏర్పాటుకి సిద్దపడినా..పడకపోయినా కాంగ్రెస్-జేడిఎస్ ఎమ్మెల్యేలతో కూడిన టీమ్ ఏర్పాటు చేసుకుని గవర్నర్‌కి తమని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించమని కోరే అవకాశం ఉంది. ఇలా చేయడం ద్వారా తమ కూటమికే మద్దతు ఉందని చెప్పుకునే ప్రయత్నం కన్పిస్తుంది..కానీ..దీనికి జెడిఎస్ అంగీకారం ముఖ్యం.
ప్రస్తుతానికి ఉన్న లెక్కల ప్రకారం ఈ మూడు పద్దతుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావచ్చు..లేదంటే సస్పెండెడ్ యానిమేషన్ జరగవచ్చు.  అలాంటి పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యేంతవరకూ గవర్నర్ పాలనే కర్నాటకకి శరణ్యంగా చెప్తున్నారు

Comments